Trending Posts

టెట్​ నోటిఫికేషన్​పై సందిగ్దత..!

టెట్​ నోటిఫికేషన్​ కోసం నిరుద్యోగులతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్లు కూడా ఎదురుచూస్తున్నారు.. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 2027 సెప్టెంబర్​ నాటికి వర్కింగ్​ టీచర్లు తప్పనిసరిగా టెట్​ సాధించాల్సి ఉంది. దీంతో చివరి వరకు వేచి చూడకుండా.. మొదటి అవకాశంగా నవంబర్​ లేదా డిసెంబర్​లో నిర్వహించే టెట్​ పరీక్షలో అర్హత సాధించేందుకు ప్రిపేర్​ అవుతున్నారు.

2010 కంటే ముందు డీఎస్సీ ద్వారా రిక్రూట్​ అయిన టీచర్లు తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాలనే నిబంధనన అమలు చేయాలని సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో 25–30వేల మంది ఉపాధ్యాయులపై ప్రభావం పడనుంది. . అయితే దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి టెట్​ నుంచి మినహాయింపు పొందాలని ఉద్యోగ సంఘాలు ప్రయత్నాలు సాగిస్తున్నాయి. కానీ మెజార్టీ టీచర్లు సుప్రీం తీర్పునకు అనుగుణంగా టెట్​ అర్హత సాధించేందుకు పుస్తకాల కుస్తీ పడుతూ టెట్​ నోటిఫికేషన్​ కోసం ఎదురుచూస్తున్నారు.

మరోవైపు కేవలం ఐదేళ్ల సర్వీసు మాత్రమే ఉండి ప్రమోషన్​ కోసం ఎదురుచూస్తున్న టీచర్లకు టెట్​ క్వాలిఫై నిర్ణయం భారంగా మారింది. సర్వీసు ఉండి.. రిటైర్మెంట్​కు దగ్గరవుతున్న తమకు సుప్రీం ఇచ్చిన తీర్పు సరికాదాని వారు ఆవేదన చెందుతున్నారు. దీనిపై రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయం తీసుకుని సుప్రీం కోర్టులో రివ్యూ పిటిషన్​ దాఖలు చేయాలని కోరుతున్నారు.

ఏటా రెండు సార్లు టెట్​ పరీక్ష నిర్వహిస్తున్న ప్రభుత్వం గతేడాది నవంబర్​ 4న టెట్​నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఈసారి టీచర్లకు టెట్​ నిర్వహించే క్రమంలో జీవోలో మార్పులు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియ పూర్తి కావాలంటే.. మరో నెల రోజులు పట్టే అవకాశం ఉన్నందున.. నవంబర్​లో టెట్​ నోటిఫికేషన్​ విడుదలపై సందిగ్దత నెలకొంది. మరో వారంలో రోజుల్లో దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. నోటిఫికేషన్​ ఎప్పుడు వచ్చినా.. సిద్ధమేనంటూ.. నిరుద్యోగులతో పాటు టీచర్లు టెట్​కు సన్నద్ధమువుతున్నారు..

Leave a Comment