రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు శుభవార్త చెప్పింది. మరో నూతన పథకానికి శ్రీకారం చుట్టింది. జూన్ రెండున ఇందిరమ్మ బీమా పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని కోటి 15 లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. ప్రతి కుటుంబానికి 5 లక్షల బీమా వర్తిస్తుంది. ఈ పథకానికి సంబంధించిన పూర్తి ప్రీమియం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించనుంది. కుటుంబంలో పెద్ద ఏ కారణం చేతనైనా చనిపోతే.. ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకం ద్వారా బాధిత కుటుంబానికి ఆర్థిక సావలంబన లభించనుంది. రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రారంభించనుంది. ఈ పథకం పకడ్బందీగా అమలు చేయడానికి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో 4000 కోట్ల నిధులను కేటాయించింది. జూన్ 2న రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ప్రారంభించిన తర్వాత ప్రజలు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. రేషన్ కార్డ్, కుటుంబ సభ్యుల ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు , పాస్పోర్ట్ సైజ్ ఫోటో, నివాస ధ్రువీకరణ పత్రం, తదితర వివరాలతో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. పథకం ప్రారంభం అనంతరం దరఖాస్తుకు సంబంధించిన మరిన్ని వివరాలను ప్రభుత్వం వెల్లడించనుంది.
జూన్ 2న ఇందిరమ్మ బీమా పథకం ప్రారంభం







